• కానిస్టేబుల్ అనిల్ వ్యాఖ్యలపై విచారణ జరపాలి.. నేతల డిమాండ్
• మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేసిన నాయకులు
మల్కాజిగిరి, సెప్టెంబర్ 02, మంచితనం న్యూస్:
కల్వకుంట్ల కవితపై అనుచితంగా, అవమానకరమైన పదజాలంతో మాట్లాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ అనిల్పై నిష్పక్షపాత విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మల్కాజిగిరి సీనియర్ నాయకుడు మద్దాలి సాయికుమార్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో సీఐకి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా మహిళల పట్ల అవమానకరమైన భాషను ఉపయోగించడం సమాజానికి ఏమాత్రం సమంజసం కాదని నాయకులు పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మరింత సంయమనంతో, గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
మహిళా గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలను ఉపేక్షించరాదని, ఈ ఘటనలో వాస్తవాలను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పరస్పర గౌరవం అత్యంత ముఖ్యమని, మహిళలను కించపరిచే ఎలాంటి వ్యాఖ్యలైనా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి నియోజకవర్గ పార్లమెంట్ ఇంచార్జ్ వేముల భవాని హాజరై తమ మద్దతు తెలిపారు. మహిళల గౌరవాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన నాయకులు కనగంటి నవీన్ కుమార్ యాదవ్, సుమలత సుధాకర్ శర్మ, పిట్ల విజయలక్ష్మి, జ్యోత్స్న అగుల్ల, పద్మజ, సందీప్, జాషువా, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.