కడ్తాల్: అనుమతులు లేని భవనంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రతిభ విద్యానికేతన్ (PVN) పాఠశాలపై తక్షణమే చర్యలు తీసుకుని, పాఠశాల అనుమతులను రద్దు చేయాలని కోరుతూ కడ్తాల్ మండల ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీఓకు ఫిర్యాదు అందజేశారు.
ఫిర్యాదుదారుల వివరాల ప్రకారం.. గతంలో విద్యాశాఖ అధికారులు, ఎంఈఓ పాఠశాలను సీజ్ చేసినప్పటికీ, అధికారుల నిబంధనలను పట్టించుకోకుండా తిరిగి పాఠశాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
పాఠశాలలో సరైన తరగతి గదులు, చిన్నారులకు అవసరమైన మరుగుదొడ్ల సౌకర్యాలు లేవని ఫిర్యాదుదారులు తెలిపారు. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు నిర్లక్ష్య వైఖరిని వీడి, పాఠశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫిర్యాదు అందజేసిన వారిలో దోనాదుల మహేష్, క్యామ శ్రీకాంత్, వెంకటేష్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.